అంతర్జాతీయ వార్తలు

భారీ భూకంపం.. 111 మంది మృతి.. మరో 100 మందికి గాయాలు

న్యూస్ వన్ టీవీ, చైనా :- చైనాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్, కింగ్స్ హై ప్రావిన్స్ ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం కారణంగా పెద్దసంఖ్యలో భవనాలు కూలిపోవడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పటి వరకూ భూకంపం ధాటికి 111 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు ప్రాంతీయ భూకంప సహాయ కేంద్రం వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

గన్సు ప్రావీన్స్ లో 100 మంది చనిపోగా.. హైడాంగ్ నగరంలో 11 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద భవనాలు, ఇళ్లు నేలకూలడంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఊహించని ఈ ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్పందించారు. భూకంప ప్రాంతాల్లో సహాయకచర్యలకు ఆటంకం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలతో ఉన్నవారికి సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు.. వారి ఆస్తులకు కూడా రక్షణ కల్పించాలని తెలిపారు.

కాగా.. భూకంప కేంద్రాన్ని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్ జౌ కి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించామని.. కింగ్ హై ప్రావిన్స్ సరిహద్దుకు సమీపంలో ఈ భూకంపం నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2008లో 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 5,335 మంది పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply